వృద్ధాశ్రమాలు, పునరావాస కేంద్రాల్లో ప్రమాణాలు తప్పనిసరి

Facebook
X
LinkedIn

సంస్థల నిర్వహణపై అదనపు కలెక్టర్ సమీక్ష

మేడ్చల్ :

జిల్లాలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాలు, ఆటిజం హోమ్స్, వికలాంగుల గృహాలు, పునరావాస కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను కచ్చితంగా పాటించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్లో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా సంస్థల ఇన్‌చార్జ్‌లు, నిర్వాహకులతో సమావేశమైన అదనపు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధులు, వికలాంగులు, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు తదితర లబ్ధిదారుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, పరిశుభ్రత, గౌరవప్రదమైన జీవనానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంస్థలు సంబంధిత శాఖల నుంచి అవసరమైన రిజిస్ట్రేషన్లు, అనుమతులు, పునరుద్ధరణలను తప్పనిసరిగా పొందాలని తెలిపారు.

అలాగే నివాసితుల వివరాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ఇతర పత్రాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారులకు నాణ్యమైన వసతి, పోషకాహారం, వైద్య సేవలు, పారిశుద్ధ్య సదుపాయాలు, సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.

ప్రభుత్వ శాఖలు నిర్వహించే తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని, తనిఖీలలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మహిళా, శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి, శాఖ అధికారులు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.