ఈసీఐఎల్, రాధిక చౌరస్తాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి

Facebook
X
LinkedIn

మంత్రి శ్రీధర్‌బాబుకు మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్‌రెడ్డి వినతి

కాప్రా, :

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్లపల్లి పర్యటన సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తా, రాధిక చౌరస్తాల్లో పాదచారుల వంతెనలు (ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు) నిర్మించాలని మాజీ కార్పొరేటర్ పజ్జారి పావని మణిపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ కాలనీల ప్రతినిధులతో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పావని మణిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాప్రా సర్కిల్ పరిధిలో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తుండటంతో ఈసీఐఎల్, రాధిక చౌరస్తాల్లో వాహన రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో రోడ్డు దాటేందుకు పాదచారులు, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ఈ రెండు ప్రధాన కూడళ్లలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ పనులను త్వరితగతిన చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ ఉప్పల్ ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, స్వర్ణరాజు, శివమణి, కాప్రా కాలనీ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి మధుకర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.