నాగారంలో ఆధ్యాత్మిక శోభ

Facebook
X
LinkedIn

సెరెనిటీ స్కూల్‌లో జగన్నాథ రథయాత్ర వైభవం

నాగారం, :

నాగారంలోని సెరెనిటీ స్కూల్‌ ఆవరణ శనివారం భక్తి పారవశ్యంతో కళకళలాడింది. ఇస్కాన్ రాంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భగవాన్ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి విగ్రహాలతో అలంకరించిన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హరినామ సంకీర్తనలు, భజనలు, జయజయధ్వానాల మధ్య సాగిన రథయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. విద్యార్థుల్లో సనాతన ధర్మం పట్ల అవగాహన, భక్తి భావం, సాంస్కృతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు శ్రీమాన్ మాధవ గోపీనాథ దాస్, శ్రీమాన్ సత్య మాధవ దాస్, శ్రీమాన్ జానీవాస దాస్ పాల్గొని జగన్నాథ రథయాత్ర విశిష్టతను వివరించారు. భక్తి మార్గం మనిషికి ఆత్మశాంతిని, సద్గుణాలను అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ వేడుకకు బీజేపీ నాయకుడు కౌకట్ల చంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి హాజరై నిర్వాహకులను అభినందించారు. సెరెనిటీ స్కూల్ యాజమాన్య ప్రతినిధి జంగా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి విద్యతో పాటు నైతిక, ఆధ్యాత్మిక విలువలు కూడా అవసరమని చెప్పారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.