తీవ్ర ఊబకాయం రోగుల్లో 100 హై-రిస్క్ శస్త్రచికిత్సలు పూర్తి

Facebook
X
LinkedIn

కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్‌కు అరుదైన మైలురాయి

హైదరాబాద్, :

అత్యంత తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించడంలో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ కీలక మైలురాయిని చేరుకుంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 60కు పైగా ఉన్న సూపర్-సూపర్ ఊబకాయం రోగులపై 100 హై-రిస్క్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది.

165 కిలోల బరువు, 63 బీఎంఐ కలిగిన 23 ఏళ్ల యువతికి ఇటీవల నిర్వహించిన శస్త్రచికిత్సతో ఈ ఘనత సాధించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జనరల్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డా. వేణుగోపాల్ పరేక్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సలను నిర్వహించింది.

వైద్యుల ప్రకారం బీఎంఐ 60కు పైగా ఉన్న రోగులు మధుమేహం, అధిక రక్తపోటు, స్లీప్ అప్నియా, ఫ్యాటీ లివర్, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్సలు అత్యంత క్లిష్టమైనవిగా పరిగణించబడతాయి.

ఈ సందర్భంగా డా. వేణుగోపాల్ పరేక్ మాట్లాడుతూ, యువతలో తీవ్రమైన ఊబకాయం వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 40-50 ఏళ్ల వయస్సు వారిలో ఎక్కువగా కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం 20-30 ఏళ్ల యువతలోనూ అధికమవుతోందన్నారు. ఊబకాయం ఒక దీర్ఘకాలిక వ్యాధి అని, సరైన వైద్య చికిత్సతో పాటు జీవనశైలి మార్పులు అవసరమని సూచించారు.

కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి మాట్లాడుతూ, సూపర్-సూపర్ ఊబకాయం రోగుల్లో 100 హై-రిస్క్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేయడం సంస్థ వైద్య నైపుణ్యానికి నిదర్శనమన్నారు. అత్యాధునిక లాపరోస్కోపిక్ పద్ధతులతో నిర్వహిస్తున్న ఈ చికిత్సల వల్ల రోగులు వేగంగా కోలుకుని సాధారణ జీవనశైలికి చేరుకుంటున్నారని తెలిపారు.