ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం.. అమలుకు సిద్ధమైన కేంద్రం

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

దేశంలో కొత్త ఆదాయ పన్ను చట్టం-2025   ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం   సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ మార్పు గురించి ప్రస్తుత పన్ను రిటర్నుల   ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ఇప్పటికే అమల్లో ఉన్న 1961 చట్టం (1961 Act) ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు.2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఆర్జించే ఆదాయానికి పాత చట్టం ప్రకారమే పన్నులు లెక్కించి, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుందని నిపుణులు వివరించారు. ప్రభుత్వం ఈ మార్పును దశలవారీగా, స్పష్టమైన ప్రణాళికతో అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు   ‘ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ ను నోటిఫై చేసింది.దీని ప్రకారం వేతన జీవులకు ఊరటనిచ్చే పలు మార్పులు చేశారు. ఇంటి అద్దె అలవెన్స్   మినహాయింపు పరిమితిని పెంచారు. 50 శాతం హెచ్ఆర్ఏ స్లాబులోకి మరిన్ని నగరాలను చేర్చారు. పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్‌ను నెలకు రూ.3,000, హాస్టల్ అలవెన్స్‌ను నెలకు రూ.9,000 వరకు పెంచారు. అదే సమయంలో హెచ్ఆర్ఏ, ఇతర పన్ను తగ్గింపుల కోసం డాక్యుమెంటేషన్, డిక్లరేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. ఈ కొత్త విధానంలో భాగంగా ‘ఫైనాన్షియల్ ఇయర్’, ‘అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘ట్యాక్స్ ఇయర్’ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టనున్నారు.ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు పన్ను ఫారమ్‌లను కూడా పూర్తిగా మార్చి, కొత్త నంబర్లను కేటాయించనున్నారు. దీనివల్ల ఫైలింగ్ ప్రక్రియలో స్పష్టత పెరిగి, సందిగ్ధత తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.