వైద్యులు సమాజానికి వరం – ఏనుగు సుదర్శన్ రెడ్డి

Facebook
X
LinkedIn

డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వైద్యులకు సన్మానం

మేడిపల్లి:

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ సేవలందిస్తున్న వైద్యులు సమాజానికి అమూల్యమైన ఆస్తి అని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మేడిపల్లిలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌ను సందర్శించిన ఆయన, అక్కడి వైద్యులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొత్త జీవితం ప్రసాదించే వైద్యులు మానవత్వానికి ప్రతిరూపాలని అన్నారు. ప్రతి పరిస్థితిలోనూ రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యులు చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని కొనియాడారు.

ఆధునిక వైద్య రంగ అభివృద్ధితో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఆ సేవలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తున్న వైద్యుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వైద్యుల సేవలు కేవలం ఒక వృత్తి కాదని, అది మానవత్వానికి చేసే మహత్తర సేవ అని అన్నారు.

డాక్టర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఇలాగే ప్రజల ఆరోగ్య సంరక్షణలో ముందుండాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఈ సత్కారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.