దేశంలో గ్యాస్‌ కొరత.. ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్‌లు మూత

Facebook
X
LinkedIn

ముంబై :

దేశంలో చమురు   గ్యాస్‌   నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం   చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తున్నది. వాణిజ్య సిలిండర్ల కొరత   కారణంగా ముంబై   లో 20 శాతం హోటళ్లు (Hotels), రెస్టారెంట్‌లు  మూతపడ్డాయి. ఈ విషయాన్ని ముంబై హోటల్‌ అండ్‌ రెస్టారంట్‌ అసోసియేషన్‌ మంగళవారం వెల్లడించింది.పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొన్నది. ముంబై మాత్రమే కాదు, గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్‌ల కొరత ఏర్పడింది. ఢిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని హోటళ్లలో వంటగ్యాస్‌ అందుబాటులో లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు. సిలిండర్ల కొరతవల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.మరోవైపు, ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బ్లాక్‌ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇక వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఓ కమిటీని వేసింది.కాగా మన దేశంలో ఏటా 31.3 మిలియన్‌ టన్నుల వంటగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 62 శాతం దిగుమతుల నుంచి వచ్చేదే. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధిని మూసివేయడంతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ప్రస్తుతం మన వద్ద సరిపడా గ్యాస్‌ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.