కొత్త కృత్రిమ మేథస్సు సాధనం ఆల్ఫా జీనోమ్ ను విడుదల
న్యూ డిల్లీ :
.జన్యు పరిశోధన రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. గూగుల్ డీప్మైండ్ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కృత్రిమ మేథస్సు సాధనం ఆల్ఫా జీనోమ్ ను విడుదల చేసింది. వ్యాధులకు కారణమయ్యే జన్యు మార్పులను గుర్తించడం, కొత్త చికిత్సల అభివృద్ధికి దోహదపడటం ఈ సాధన ప్రధాన లక్ష్యం. ఆల్ఫా జీనోమ్ ఒకేసారి దాదాపు పది లక్షల డీఎన్ఏ అక్షరాలను విశ్లేషించగల సామర్థ్యం కలిగి ఉంది. జన్యు మార్పులు జీన్ల పనితీరుపై ఎలా ప్రభావం చూపుతున్నాయి, ఏ కణాల్లో అవి క్రియాశీలకంగా మారుతున్నాయి, ఎంత స్థాయిలో పని చేస్తున్నాయనే అంశాలను ఇది అంచనా వేస్తుంది. హృద్రోగాలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మానసిక ఆరోగ్య రుగ్మతలు, అనేక రకాల క్యాన్సర్లు వంటి సాధారణ వంశపారంపర్య వ్యాధులు ప్రోటీన్ తయారీ జీన్ల మార్పుల వల్ల కాకుండా, జీన్ల నియంత్రణలో వచ్చే మార్పుల వల్లే ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఏ మార్పు అసలు కారణమో గుర్తించడం ఇప్పటివరకు పెద్ద సవాలుగా మారింది.మానవ, ఎలుకల జన్యు డేటాతో శిక్షణ..ఈ సందర్భంగా డీప్మైండ్ పరిశోధకురాలు నటాషా లాటిషేవా మాట్లాడుతూ జీనోమ్ ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడానికి, జీవనాన్ని నియంత్రించే జీవ శాస్త్ర కోడ్పై పరిశోధనను వేగవంతం చేయడమే మా లక్ష్యం.. అని పేర్కొన్నారు. మనిషి జీనోమ్లో దాదాపు మూడు బిలియన్ల డీఎన్ఏ అక్షర జంటలు ఉంటాయి. ఇందులో కేవలం రెండు శాతం మాత్రమే ప్రోటీన్ల తయారీకి నేరుగా ఉపయోగపడతాయి. మిగతా భాగం జీన్లు ఎప్పుడు, ఎక్కడ, ఎంత మేరకు పని చేయాలో నియంత్రించే కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజలకు అందుబాటులో ఉన్న మానవ, ఎలుకల జన్యు డేటాతో ఆల్ఫా జీనోమ్కు శిక్షణ ఇచ్చారు. దీని ద్వారా మెదడు, కాలేయం వంటి వివిధ అవయవాల్లో జన్యు మార్పులు జీవ ప్రక్రియలపై చూపే ప్రభావాన్ని అంచనా వేయగలుగుతోంది.ఈ సాధనం క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులకు సంబంధించిన కీలక జన్యు ప్రాంతాలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే నిర్దిష్ట కణాల్లో మాత్రమే జీన్లు క్రియాశీలకంగా మారేలా డీఎన్ఏ క్రమాలను రూపకల్పన చేయడంలో సహాయపడుతూ, జీన్ థెరపీ అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్వతంత్ర నిపుణులు దీనిని జన్యు శాస్త్రంలో ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించినప్పటికీ, ప్రయోగశాల పరీక్షలకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయంగా మారేందుకు ఇంకా మరింత పరిశోధన అవసరమని సూచిస్తున్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.