EPFO ATM Withdrawal: సంఘటిత రంగంలో ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఇది రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన పథకమే అయినప్పటికీ.. మధ్యలో కొన్ని అత్యవసర సమయాల్లో కూడా డబ్బుల్ని పాక్షికంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక దీని కోసం ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్కు.. డబ్బులు వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పీఎఫ్ విత్డ్రాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
ATM Withdrawal of PF: ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్ కింద డబ్బులు విత్డ్రాపై కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి ఉద్యోగులు.. తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని.. నేరుగా ఏటీఎంల ద్వారానే విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న కార్మికుల కోసం వారికి మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు.. సర్వీసుల్ని విస్తరించేందుకు కేంద్ర కార్మిక శాఖ తమ ఐటీ వ్యవస్థల్ని అప్గ్రేడ్ చేస్తుందని వివరించింది. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ డబ్బుల విత్డ్రాపైనా స్పందించారు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దవ్రా. ఇప్పటికే పీఎఫ్ క్లెయిమ్స్ పరిష్కారం కోసం ఈ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
‘మేం ఇప్పటికే క్లెయిమ్స్ను చాలా వేగంగా సెటిల్ చేస్తున్నాం. ఇంకా జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తాం. క్లెయిమ్ దారుడు, లబ్ధిదారుడు, ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి.. ఇలా ఎవరైనా ఏటీఎంల ద్వారానే తమ క్లెయిమ్స్ యాక్సెస్ చేస్కొని.. డబ్బుల్ని తీసుకోవచ్చు. ఇక్కడ పెద్దగా మానవ ప్రమేయం లేకుండానే జరుగుతుంది.’ అని సుమితా చెప్పారు.
వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయని.. ఇక ప్రతి 2,3 నెలలకు ఓసారి మీరు గణనీయ మార్పుల్ని గమనిస్తారని ఆమె వివరించారు. ఇక జనవరి 2025 నాటికి ఇంకా మెరుగైన వ్యవస్థను చూస్తారని భావిస్తున్నట్లు అన్నారు సుమితా. ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు (EPFO) 70 మిలియన్లకుపైగా (7 కోట్లు) యాక్టివ్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు.