ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారుఅమరావతి: ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చెప్పారు.
‘‘ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయి. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది. మంత్రి లోకేశ్ (Nara Lokesh) కృషి వల్లే ఇది సాధ్యమైంది. గూగుల్తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుంది. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులనూ దారి మళ్లించారు. నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చాం. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. అమరావతి కోసం ఇప్పటికే రూ.31 వేల కోట్లు సేకరించాం.
2027 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించాం. మూడు నెలలకు కలిపి ఒకేసారి పింఛన్ ఇచ్చేలా విధానం తెచ్చాం. దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే. ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడంలేదు. దీపం-2 కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. 60 శాతానికి పైగా భూసమస్యల ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదు. 90 శాతం సమస్యలు ఐదారు శాఖల్లోనే ఉన్నాయి. సంక్రాంతి నాటికి ఆర్అండ్బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు. వచ్చే 20 ఏళ్లలో 15 శాతం వృద్ధి రావాలి’’ అని చంద్రబాబు తెలిపారు.
రాళ్లు, రప్పల మధ్య నగరాన్ని చూడగలిగిన దార్శనికుడు చంద్రబాబు: పవన్
రాళ్లు, రప్పల మధ్య నగరాన్ని చూడగలిగిన దార్శనికుడు సీఎం చంద్రబాబు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు తమను విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని చెప్పారు. ప్రజలు తమ నుంచి చాలా ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం. విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. గత ప్రభుత్వం అధికారులను చాలా ఇబ్బంది పెట్టింది. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంది. జీతాలు ఇవ్వలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. అభివృద్ధికి అధికారుల సహకారం కావాలి. కాకినాడలో 3 చెక్పోస్టులు ఉన్నా స్మగ్లింగ్ జరుగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్లు వ్యవస్థను బలోపేతం చేయాలి. ’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.