కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్ యూజే ధర్నా
చట్టాల పునరుద్ధరణ చేసేవరకు పోరుబాట: ఫెడరేషన్ నాయకులు రాంచందర్ బనపున్నయ్య
హైదరాబాద్ :
కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకునేంతవరకు కార్మికులు, జర్నలిస్టులు పోరాటం చేయాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ఐయూజే) ఆధ్వర్యంలో కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, జర్నలిస్టుల ఐక్యత జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలపాటు ధర్నా జరిగింది.

ఈ ధర్నాకు ఫెడరేషన్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ పి. రాంచందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను గాలికొదిలేసి కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవరిస్తున్నదన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేయడం అన్యాయమని చెప్పారు. వెంటనే లేబర్ కోడ్ల నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ… ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దుచేయడాన్ని ఖండించారు. ఇప్పటికే అనేక సమస్యలతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారీ, కొత్త లేబర్ కోడ్లతో సమస్యలు జరిలమవుతాయని అన్నారు. జర్నలిస్టులు ఇప్పటికే కోడ్లు విఘాతంగా మారాయని వ్యాఖ్యానించారు. ధర్నా అనంతరం సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ పృష్టికి ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

కార్మికులకు జీవన్మరణ సమస్య: జె వెంకటేష్
జర్నలిస్టులనుద్దేశించి కార్మిక సంఘం నేత జె వెంకటేష్ మాట్లాడుతూ.. కార్మిక చట్టాలు స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలను నిర్ణయించే అధికారం యాజమానులు, ప్రభుత్వాల చేతుల్లో లేబర్కోడ్ ద్వారా పెట్టారని చెప్పారు. కనీస వేతనం రూ.26 వేలు కూడా ఇవ్వకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్న 8 పనిగంటల పనివిధానం పోయి 12 నుంచి 16 గంటల వరకు పెరుగుతుందని వివరించారు. ఓవర్టెజ్పై నిబంధనలు రూపొందించలేదని చెప్పారు. ఉద్యోగ భద్రతకు గ్యారంటీ లేదని చెప్పారు. ఈఎస్ఐ, పీఎఫ్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చేతులేత్తేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. ప్రభాకర్, గుడిగ రఘు, బి. రాజశేఖర్, జి. మాణిక్ ప్రభు, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్, గండ్ర నవీన్, దామోదర్, కార్యవర్గ సభ్యులు మణిమాల, హరిప్రసాద్, మేకల కృష్ణ, మధుకర్, రమేష్, సైదులు, హెచ్ యూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి. జగదీశ్వర్, హెచ్ యూజే నాయకులు లలిత, రమాదేవి, రత్నాకర్, తలారీ శ్రీనివాసరావు, జీవన్ రెడ్డి, రమేష్, కాలేబు, సర్వేశ్వర్ రావు, బ్రహ్మం, రాము, రవి తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.