న్యూఢిల్లీ :
భారతీయ వస్త్ర, రత్నాలు-ఆభరణాల ఎగుమతుల్లో మెజారిటీ వాటా అమెరికాదే. అందుకే ఆ దేశం టారిఫ్లు ఇప్పుడు ఈ రంగాల్లో ప్రకంపనల్ని పుట్టిస్తున్నాయి. పెరిగే సుంకాల భారం.. అమెరికాలో భారతీయ వస్త్ర, రత్నాలు-ఆభరణాల వస్తూత్పత్తుల ధరల్ని పెంచగలవు. ఇదే జరిగితే మార్కెట్లో అమ్మకాలు పడిపోతాయి. ప్రత్యామ్నాయంగా అమెరికన్లు ఇతర దేశాల నుంచి వస్తున్న వస్త్ర, రత్నాలు-ఆభరణాల వైపు చూసే వీలున్నది. దీంతో క్షీణించే ఎగుమతులు.. ఉత్పత్తి తగ్గుదలకు దారితీస్తే అంతిమంగా వ్యయ నియంత్రణ, ఉద్యోగుల తొలగింపులు, నష్టాల్లో ఉన్న సంస్థల మూసివేతలే ఉంటాయని ఆయా రంగాల నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సుంకాలు ఇలాగే కొనసాగితే దేశీయ వస్త్ర, రత్నాలు-ఆభరణాల రంగాల్లో 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డట్టేనని అంచనా వేస్తున్నారు. ఇక ఉన్న ఉద్యోగాలనే తీసేసే కంపెనీలు.. కొత్తగా నియామకాలకు ఎందుకు వెళ్తాయని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉద్యోగావకాశాలూ సన్నగిల్లుతాయని పలువురు పేర్కొంటున్నారు. తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో లాజిస్టిక్ వర్కర్లు, షాప్-ఫ్లోర్ వర్కర్లు, సేల్స్ సిబ్బందికి ఇబ్బందులేనన్న అంచనాలున్నాయి.టెక్స్టైల్స్, ఆటో కంపోనెంట్స్, వ్యవసాయ, రత్నాలు-ఆభరణాల రంగాలు అమెరికా సుంకాలతో తీవ్రంగా ప్రభావితమయ్యే వీలున్నది. టారిఫ్లు 6 నెలలు ఇలాగే ఉంటే అత్యధికంగా జీవనోపాధినిస్తున్న వస్త్ర పరిశ్రమల్లో లక్ష ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నది. సూరత్, ముంబై సీప్జ్ వంటి రత్నాల హబ్ల్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగులు రిస్క్ను ఎదుర్కొంటారు.ఎలక్ట్రానిక్స్, రత్నాలు-ఆభరణాలు, టెక్స్టైల్స్, వాహన విడిభాగాలు, తోలు, పాదరక్షలు, రొయ్యలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు అమెరికా టారిఫ్లతో ప్రభావితం అవుతాయి. ఇప్పటికే ఆయా రంగాల్లోని కంపెనీలు వ్యయ నియంత్రణ చేయడం, కొత్త నియామకాల ప్రక్రియను ఆపేస్తున్నాయి.