రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యను బైక్కు కట్టి గ్రామానికి తీసుకెల్లిన భర్త
నాగ్పూర్ :
మహారాష్ట్ర నాగ్పూర్ లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యను ఓ వ్యక్తి బైక్కు కట్టి గ్రామానికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ సియెనికి చెందిన 35 ఏళ్ల అమిత్ యాదవ్, గ్యార్సి దంపతులు గత కొంత కాలంగా నాగ్పూర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 9న రాఖీ సందర్భంగా వీరు మధ్యప్రదేశ్లోని కరన్పూర్కు బైక్పై బయల్దేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బైక్ను నాగ్పూర్-జబల్పుర్ జాతీయ రహదారి పై వేంగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో మహిళ బైక్పై నుంచి కిందపడిపోవడంతో.. ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ప్రమాదంలో గాయపడిన అమిత్ యాదవ్.. సాయం కోసం వాహనదారులను అభ్యర్థించాడు. అయితే, సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక చనిపోయిన తన భార్య మృతదేహాన్ని బైక్కు కట్టుకుని మధ్యప్రదేశ్లోని తన గ్రామానికి బయల్దేరాడు. కాసేపటికి వీరి బైక్ను పోలీసులు ఫాలో చేసి ఆపారు. గ్యార్సి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగ్పూర్లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య మృతదేహాన్ని బైక్కు కట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.