పార్లమెంట్ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయం

Facebook
X
LinkedIn

– రాష్ట్రానికి ఖరీఫ్ 2025కి కేటాయించిన యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే –

   రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్ :

పార్లమెంట్ సాక్షిగా యూరియా సరఫరాపై తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు అన్నారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించి, పార్లమెంట్ లో మాత్రం 20.20 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని చెప్పడం వలన రాష్ట్ర రైతులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని మంత్రిగారు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యూరియా పరిస్థితులపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ గారికి కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల విభాగం రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల లేఖను జతపరిచి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఖరీఫ్ 2025 కోసం రాష్ట్రానికి కేవలం 9.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిందని, కేటాయించిన దానిలో కూడా నెలవారి సరఫరా చేయాల్సిన దానికంటే తక్కువగా సరఫరా చేయడం వలన రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. ఎప్రిల్ నుండి జులై వరకు కేటాయింపుల ప్రకారం 6.60 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 4.36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని, దీంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు. యూరియా కొరతపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డాగారికి లేఖలు కూడా రాయడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ లాంటి వేదికలలోకూడా తప్పుడు లెక్కలు సమర్పించడం రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, జులై మాసం వరకు కేటాయింపుల ప్రకారం సరఫరా కాని 2.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కలుపుకొని, ఆగస్టు నెలకు కేటాయించిన యూరియాను త్వరగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రిగారు లేఖలో కోరారు.