భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలు

Facebook
X
LinkedIn

ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ఆవేదన

న్యూ డిల్లీ ;

భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్‌ గాంధీ     అన్నారు. అలాంటి ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘బాగిదారి న్యాయ మహా సమ్మేళనం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ   ఆర్‌ఎస్‌ఎస్‌   పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఓబీసీల చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేశారని అన్నారు. 2004 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఈ రెండు దశాబ్దాల కాలం వెనుదిరిగి చూసుకుంటే.. ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం కోసం తాను చేయగలిగినంత చేయలేకపోయానని అనిపిస్తోందని పశ్చాత్తాపం వెలిబుచ్చారు. ఆ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నానని, సమస్యలు సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలమని వ్యాఖ్యానించారు.అందుకోసం చరిత్ర తెలుసుకోవాలని రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో దళితుల చరిత్రను అంబేడ్కర్‌ అర్థం చేసుకున్నారని చెప్పారు. తెలుసుకోవడానికి ఓబీసీల చరిత్ర ఎక్కడుందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఉద్దేశపూర్వకంగా ఆ చరిత్రను చెరిపేశాయని ఆరోపించారు. ఓబీసీలు వారి శ్రమకు తగిన ఫలితాలను అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కార్పొరేట్‌ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారు? మీడియా రంగంలో వారికి స్థానం ఎక్కడుంది?’ అని ఆయన ప్రశ్నించారు.కులగణన కూడా ఎప్పుడో చేయాల్సిందని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తాము తప్పకుండా కులగణన పూర్తిచేస్తామని రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా భాషా వివాదంపైనా రాహుల్‌గాంధీ స్పందించారు. అభివృద్ధిలో విద్యే ప్రధానమని, ఇంగ్లిష్‌ నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపవుతాయని చెప్పారు. బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ భాషలూ ముఖ్యమేనని, దాంతోపాటు ఆంగ్ల ప్రాధాన్యాన్నీ అర్థం చేసుకోవాలని అన్నారు.