బెంగళూరు రెంటల్ మార్కెట్ మాఫియాగా మారింది

Facebook
X
LinkedIn

బెంగళూరు హౌస్ ఓనర్ల డిమాండ్లపై ఆగ్రహావేశాలు

సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.19.25 లక్షలు అడిగితేనే షాక్ అయిన కెనడా పౌరుడు
“ఈ డిపాజిట్ కంటే తక్కువకే మహీంద్రా థార్ వస్తుంది” – సోషల్ మీడియాలో కామెంట్స్

బెంగళూరు:
బెంగళూరులో ఇంటి అద్దె ధరలు సామాన్య ప్రజల్ని సైతం కుదిపేస్తున్నాయి. తాజాగా డోమ్లూర్ డైమండ్ డిస్ట్రిక్ట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వివరాలను ఒక కెనడా పౌరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నగర రియల్టీ రంగంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

కాలేబ్ ఫ్రైసెన్ అనే కెనడా పౌరుడు, డోమ్లూర్‌లోని 3బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ అద్దె వివరాలను ‘ఎక్స్’ (ట్విట్టర్) లో షేర్ చేశారు. నెలకు అద్దె రూ.1.75 లక్షలు కాగా, అడిగిన సెక్యూరిటీ డిపాజిట్ ఏకంగా రూ.19.25 లక్షలు! దీనిని చూసి కాలేబ్ ఆశ్చర్యపోయారు.

“ఈ డిపాజిట్‌తో కొత్త థార్ కారు వస్తుంది. ఇంత డిమాండ్ చేయడం యజమానుల గొంతెమ్మ కోరికలకే నిదర్శనం” అంటూ ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో, ఇందిరానగర్ పరిసరాల్లో తక్కువ డిపాజిట్‌తో (2-3 నెలల) రూ.80 వేల నుంచి రూ.1 లక్షలోపు అద్దె ఇల్లు ఎక్కడైనా ఉందా అని నెటిజన్లను ప్రశ్నించారు.

ఈ ట్వీట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. నెటిజన్లలో తీవ్ర స్పందనను రేకెత్తించింది.
“ఇక్కడ రెంటల్ మార్కెట్ మాఫియాగా మారింది”, “అద్దె డిపాజిట్ డిమాండ్స్ వల్లే బెంగళూరుకు రావాలన్న ఆలోచన మానేశా” అంటూ పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కొంతమంది వినోదాత్మకంగా స్పందిస్తూ – “ఈ అడ్వాన్స్‌తో కిడ్నీ కూడా కొనొచ్చు!” అన్నారు.

ఈ ఘటన వెనుక బెంగళూరులో అద్దె బాద్యతలు ఎలా సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.