బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్, పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది
బెంగళూరు:
ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన గువహటి-చెన్నై విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో ఇంధనం చాలా తక్కువగా ఉన్నట్లు పైలట్ గుర్తించి, వెంటనే ‘మేడే’ కాల్ ద్వారా ఏటీసీకి సమాచారమిచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్కు ఏర్పాట్లు చేశారు. పైలట్ చాకచక్యంతో విమానం సురక్షితంగా దిగింది.
మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గువహటి నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమానయాన వర్గాలు తెలిపాయి. విమానం గాల్లో ఉన్న సమయంలో ఇంధనం అత్యల్పంగా ఉండటం గమనించిన పైలట్, ఆపద సంకేతంగా పరిగణించే ‘మేడే’ కాల్ను పంపాడు. బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్కు తగిన ఏర్పాట్లు చేయగా, విమానం సురక్షితంగా దిగింది.
విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా ఆత్మస్థైర్యంతో బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. విమానయాన నిబంధనలు, భద్రతా ప్రమాణాల పరంగా ఏవైనా లోపాలున్నాయా అనే దానిపై అధికారులు దృష్టి సారించారు.
‘మేడే’ అంటే ఏంటి?
విమానయాన రంగంలో ‘మేడే’ అనేది అత్యవసర సంకేతం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పైలట్లు దీనిని ఉపయోగిస్తారు. ఇది అత్యధిక ప్రాధాన్యం కలిగిన సంకేతంగా పరిగణించబడుతుంది. సమీపంలోని ఏటీసీ కేంద్రం తక్షణంగా స్పందించి అవసరమైన సహాయ చర్యలు ప్రారంభిస్తుంది.
ఈ ఘటనలో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పినట్టు పరిశీలకులు పేర్కొంటున్నారు.