అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్‌

Facebook
X
LinkedIn

డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత అధికారులు

న్యూ డిల్లీ :

గతవారం అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా   విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. ఇక ఈ ఘటనపై అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్‌   ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా   బోయింగ్‌ ఏ-171 విమానం గత గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే రెసిడెంట్‌ డాక్టర్స్‌ హాస్టల్‌ భవనంపై కూలిపోయింది. ఇక ఈ ప్రమాదం జరిగిన దాదాపు 27 గంటల తర్వాత ఈ బ్లాక్‌బాక్సును విమానం కూలిన బిల్డింగ్‌పై గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ఈ బ్లాక్‌ బాక్స్‌ చాలా కీలకం. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో అందులోని డేటాను విశ్లేషించేందుకు దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

వాషింగ్టన్‌ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉందని సదరు కథనాలు వెల్లడించాయి.సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్‌బాక్స్‌ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు. ప్రమాదానికి గల కారణం, ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారం అంతా ఈ బ్లాక్‌ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. భవిష్యత్తు ప్రమాదాలను నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఎయిర్‌ ఇండియా విమానం కూలని అనంతరం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ధాటికి బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.