బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంహెచ్‌ పోరాటాల్లోనూ పాత్రికేయ రంగంలో విశేష కృషి

Facebook
X
LinkedIn


సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

విజయవాడ :

ప్రజా ఉద్యమ నిర్మాణం, యువతను ప్రోత్సహించడంలో నాయకుడిగా, ప్రజలను చైతన్యం చేయడంలో పాత్రికేయుడిగా మోటూరు హనుమంతరావు బహుముఖ పాత్ర నిర్వహించారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన సిపిఎం అగ్రనేత మోటూరు హనుమంతరావు 24వ వర్థంతి సభ విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. తొలుత ఎంహెచ్‌ చిత్రపటానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి, రాజ్యసభ సభ్యుడిగా మోటూరు హనుమంతరావు పీడిత ప్రజల తరుపున తన గళాన్ని వినిపించారని తెలిపారు. సిద్ధాంతకర్తగా, వక్తగా విప్లవ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని తెలిపారు.

ప్రజాపాత్రికేయునిగా విశాలాంధ్ర, అనంతరం ప్రజాశక్తి పత్రికల సంపాదకునిగా ఆయన నిర్వహించిన బాధ్యత అనిర్వచనీయమని పేర్కొన్నారు. జై తెలంగాణా, జైఆంధ్ర ఉద్యమ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నా తెలుగు ప్రజల సమైక్యతపై ఆయన రచనలు దిక్సూచిగా ఉన్నాయని తెలిపారు. జాతీయోద్యమ కాలంలో ప్రజలను చైతన్యం చేయడంలో వాస్తవాలను చెప్పడంలో, దోపిడీ, దుర్మార్గాలను వెల్లడిరచడంలో ఉద్యమకారులకు పత్రికలే కీలకంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కొన్ని పత్రికలు స్వభావం మారినా దోపిడీ, అణచివేత కొనసాగినంతకాలం వాటికి వ్యతిరేకంగా ప్రజాపత్రికలు కీలకపాత్ర నిర్వహించాలన్నారు. ఉద్యమ లక్ష్యం, ప్రజల ప్రయోజనం దిక్సూచీగా ఉండే ఏ పత్రికైనా ప్రజల నమ్మకాన్ని చూరగొంటుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తులు మీడియా గొంతునొక్కుతున్నాయని, నిజాలను చెప్పిన వారిని జైలుకు పంపిస్తున్నారని, అటువంటి నిర్బంధాలను ఎదిరించి ప్రత్యామ్నాయ మీడియాను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువతను పోరాటాల వైపు మళ్లించడంలో ఆయన వాగ్దాటి, విశ్లేషణ మరువలేనివని పేర్కొన్నారు. మోటూరు హనుమంతరావు అల్లుడు డాక్టర్‌ ఎస్‌.సుధాకర్‌ మాట్లాడుతూ ఆయన జీవించినంతకాలం పార్టీ కోసమే పరితపించారని అన్నారు. ఎంహెచ్‌ ప్రతిపనిలోనూ ప్రజలను చైతన్యం చేయడం, పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కీలకంగా ఉండేదని అన్నారు. నాయకత్వ స్థానంలో ఉన్నా కార్మికులకు అత్యంత విలువ ఇచ్చేవారని చెప్పారు. ఈ సభలో మాజీ ఎంపి పి.మధు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు, తులసీదాస్‌, రాంభూపాల్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సిహెచ్‌. నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.