ఢిల్లీ పర్యటనలో లోకేశ్ అమిత్ షాతో 25 నిమిషాల భేటీ

Facebook
X
LinkedIn

రాష్ట్రాభివృద్ధిపై కీలక చర్చ
యువగళం పుస్తకం అందజేత
కేంద్ర సహకారంపై భరోసా ఇచ్చిన అమిత్ షా

ఢిల్లీ :

ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీ సుమారు 25 నిమిషాల పాటు సాగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

లోకేశ్‌ కేంద్ర మంత్రి అమిత్ షాకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ నెల 21న విశాఖపట్నంలో Prime Minister మోదీ హాజరవుతున్న ‘యోగాంధ్ర’ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై వివరించడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన ‘యువగళం’ పుస్తకాన్ని లోకేశ్‌ అమిత్ షాకు అందజేశారు. ప్రజల్లో చైతన్యం నింపిన పాదయాత్రకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు అమిత్ షా. చంద్రబాబు నాయుడు అనుభవంతో ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్‌కు కేంద్రం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశం అనంతరం లోకేశ్‌ మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. చిరాగ్ పాశ్వాన్, అర్జున్‌రామ్ మేఘ్వాల్‌లను కలవనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈరోజు ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.