ఈనెల 19న శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర… ఇస్రో

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగ‌న్ వ్యోమ‌నౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌, పోలండ్‌, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి   పంపుతున్నారు. ఈ మిషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా   పైలట్‌గా వ్యవహరించబోతున్నారు.అమెరికా ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ ‘యాక్సియమ్‌’   చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్‌-4’ మిషన్‌  లో భాగంగా స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌   ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్‌ రోదసి యాత్ర ద్వారా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌ 10, జూన్‌ 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్‌-9 రాకెట్‌ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్‌ లీకేజ్‌ కారణంగా జూన్‌ 11న జరగాల్సిన ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు. లీకేజ్‌కు సంబంధించిన మరమ్మత్తులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని, రాకెట్‌ లాంచింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు స్పేస్‌ఎక్స్‌ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించింది.