ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా చర్యలు
మరోసారి స్పష్టం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూ డిల్లీ :
ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పాక్ పై ఇప్పటికే మూడుసార్లు వారి సొంతగడ్డపైనే దాడులు చేశామని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్ లో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.‘బెంగాల్ గడ్డ నుంచి 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నా.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. పాకిస్థాన్ను ఇప్పటికే దాని సొంత గడ్డపై మూడు సార్లు దాడులు చేశాం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. భారతీయ మహిళల గౌరవాన్ని అవమానించిన ఉగ్రవాదులపై దేశ సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి.ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచివేశారు. మన సైన్యం సింధూరం శక్తిని వారికి తెలిసేలా చేసింది. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంభించింది. పాక్ ఎన్నడూ ఊహించని సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ మూడుసార్లు దాడులు చేశాం. ఆపరేషన్ సిందూర్తో.. భారత్పై దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రపంచానికి చాటిచెప్పాం. ఈ విషయాన్ని పాకిస్థాన్ అర్థం చేసుకోవాలి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.