విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్
న్యూ డిల్లీ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ తాజాగా స్పందించారు. ఈ దాడి కశ్మీర్లో పర్యాటకాన్ని దెబ్బతీసే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే లక్ష్యంతో జరిగిన ‘అనాగరిక’ చర్యగా అభివర్ణించారు. డెన్మార్క్, నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై సంచలన ఆరోపణలు చేశారు. మునీర్ తీవ్రమైన మతపరమైన దృక్పథంతో నడిచే వ్యక్తి అని విమర్శించారు.‘పహల్గాంలో జరిగిన దాడిలో లష్కరే ఉగ్రవాదులు మతం నిర్ధరించుకున్న తర్వాత కుటుంబ సభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకుతెచ్చారు. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన పర్యాటక రంగాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ఈ దాడి జరిగింది’ అని అన్నారు.
పాక్ ఆర్మీ చీఫ్కి ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి
మరోవైపు పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్గా పాక్ ప్రభుత్వం పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారత్తో పోరులో పాక్ బలగాలను ముందుండి నడిపించినందుకే ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.ఫీల్డ్ మార్షల్ అన్నది పాక్లో అత్యున్నత మిలిటరీ ర్యాంకు. పాక్లో ఈ హోదా పొందిన రెండో వ్యక్తి మునీరే కావడం విశేషం. ఇంతకుముందు 1959లో జనరల్ ఆయుబ్ ఖాన్కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టారు. 2022 నవంబర్లో ఆర్మీ చీఫ్గా మునీర్ బాధ్యతలు చేపట్టారు. మునీర్కు ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవలే మరిన్ని అధికారాలు కల్పించింది. మిలిటరీ కోర్టుల్లో పౌరులను విచారించేందుకు అనుమతించింది. తాజాగా ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి లభించడంతో మునీర్ ప్రాబల్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.