నీట మునిగిన టెక్‌ నగరం..

Facebook
X
LinkedIn

బెంగళూరు :

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా, టెక్‌ నగరం బెంగళూరు ను భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున మధ్య కుండపోత వర్షం కురిసింది. దాదాపు ఆరు గంటలకుపైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి.కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం ప్రకారం.. కెంగేరిలో అత్యధికంగా 132 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లిలో 131.5 మి.మీ వర్షపాతంతో రెండో స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. స్థానిక వాతావరణ కేంద్రం ప్రకారం.. సోమవారం ఉదయం 8.30 గంటలకు గత 24 గంటల్లో బెంగళూరు నగరంలో సగటు వర్షపాతం 105.5 మి.మీ.గా రికార్డైంది.ప్రసిద్ధ సిల్క్‌ బోర్డ్‌ జంక్షన్‌, బొమ్మనహళ్లి, హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఅవుట్‌లను వర్షం ముంచెత్తింది. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగర వాసులు పేర్కొంటున్నారు. నగరంలో వర్షం సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తున్నారు. వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బీ బసవరాజ్.. సాయి లేఅవుట్‌లోని ప్రభావిత ప్రాంతాన్ని ఈ ఉదయం జేసీబీపై ఎక్కి సందర్శించారు. మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.