రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కార్మికుల నిరంతర ఉపాధికి కృషి
రూ.238 కోట్లతో ‘అభయహస్తం’
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రూ. 428 కోట్ల బకాయిల చెక్కు విడుదల చేస్తున్న మంత్రి తుమ్మల. చిత్రంలో శైలజారామయ్యర్, శ్రీరాములు, సత్యనారాయణ, జగన్నాథం, మురళి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే అమలుచేస్తామన్నారు. అన్ని ప్రభుత్వశాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని, ప్రైవేటుసంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్ అమీర్పేటలో చేనేతశాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ‘‘చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం చేనేత, జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించకపోవడంతో మా ప్రభుత్వం మీద భారం పడింది. కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు, ఇతర పథకం కింద రూ.428 కోట్లు, నేతన్నకు చేయూత పథకం కింద రూ.290.09 కోట్ల బకాయిలు విడుదల చేశాం. మరమగ్గాల పథకం కింద రూ.5.45 కోట్లు, 10శాతం నూలు సబ్సిడీ కింద రూ.37.49 కోట్లు, పావలావడ్డీ కింద రూ.1.09 కోట్లు విడుదల చేశాం. నేత కార్మికుల ఉపాధి కోసం.. ఏటా 64.70 లక్షల మంది స్వయంసహాయక సంఘాల మహిళలకు రెండు చొప్పున ఏకరూప చీరల పంపిణీ పథకాన్ని చేపడతాం. జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్టీ)కి త్వరలోనే శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం’’ అని మంత్రి తుమ్మల తెలిపారు. ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వస్త్రప్రదర్శన, దుకాణాల ద్వారా 40% రాయితీపై రూ.కోటి విలువైన వస్త్రాల విక్రయం జరిగిందని తెలిపారు. అనంతరం చేనేత, హస్త కళాకారులు గజం అంజయ్య, గజం గోవర్ధన్, చింతకింది మల్లేశం, ధనలక్ష్మి, వైకుంఠం, ఖలీల్, దర్జన్, సలీం, సులోచన, విమల, ప్రణయ్, అన్వర్, ఇంద్రజీత్, సత్యవతిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నాయుడు సత్యనారాయణ, టెస్కో మాజీ ఛైర్మన్లు మండల శ్రీరాములు, గడ్డం జగన్నాథం, పద్మశాలి సంఘం నేత మురళి తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.