సంక్రాంతి వేడుకలకు కుటుంబ సమేతంగా సొంతూరుకి సీఎం
క్షణం తీరిక లేకుండా అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు హాజరు
సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
మహిళల స్వయం ఉపాధికి ఈ-ఆటోలు అందజేత
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల మానసిక వికాసానికి కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం
తెలుగునాడు, నారావారిపల్లె :-
సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా స్వగ్రామం నారావారిపల్లె వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడా తీరిక లేకుండా ప్రజాసేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. సాధారణ రోజుల్లో పాలన వ్యవహారాల్లో బిజీబిజీగా ఉండే సీఎం చంద్రబాబు పండుగ పూట కూడా ఏమాత్రం విశ్రాంతి లేకుండా గడిపారు. ఉదయం స్థానిక నేతలతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం సొంతగ్రామం నుంచి చంద్రగిరి మండలంలోని వివిధ గ్రామాలకు అవసరమైన రోడ్లు, విద్యుత్ కేంద్రాలు, పాఠశాల భవనాలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
నాణ్యమైన నిత్యవసరాలకై ఒప్పందం
మహిళా సంఘాలకు చౌకైన, నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేసేందుకు ఈజీ మార్ట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఈజీ మార్ట్ ద్వారా పలువురు మహిళలు అవగాహన కలిగేలా ఆన్లైన్లో నిత్యవసర సరుకులు కొనుగోలు చేశారు. మొత్తం ఎన్ని మార్టులు ఉన్నాయని మార్ట్ ప్రతినిధులను సీఎం ప్రశ్నించగా.. ప్రస్తుతానికి కుప్పంలో ఈజీ మార్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, త్వరలో తిరుపతి జిల్లా అంతటా మార్టుల ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 15 మంది మహిళలకు స్వయంఉపాధి నిమిత్తం సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. ఈ-ఆటోల ద్వారా నెలకు ఆయిల్ రూపంలో రూ.12 వేల వరకూ ఆదా అవుతుందని సీఎంకు అధికారులు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో 100 శాతం శారీరక, మానసిక, ప్రవర్తనా సంసిద్ధత తీసుకొచ్చేందుకు కేర్ అండ్ గ్రో సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నారావారిపల్లె పరిధిలోని 8 అంగన్వాడీ కేంద్రాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కుప్పంలో ప్రారంభించగా తల్లులు, అంగన్వాడీ టీచర్లు సంతృప్తిగా ఉన్నారని, చిన్నారులు కూడా యాక్టివ్గా వున్నారని సీఎం అన్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
సొంతూరు నారావారిపల్లె నుంచే పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రగిరి మండలంలోని రంగంపేటలో రూ.1.10 కోట్లతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డిజిటల్ క్లాస్ రూమ్లు, రూ.3.2కోట్లతో కందులవారిపల్లి, చిన్నరామాపురం, ఎ.రంగంపేట గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నారావారిపల్లెలో రూ. 4.27 కోట్లతో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సోలార్ రూఫ్టాప్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా.., పాలసీపై పూర్తి అవగాహనతో ఉన్నారా అని అధికారులను ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీతో సోలార్ ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ కల్పిస్తున్నామన్నారు. ఇతరులకు కూడా 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ. 60 వేలు రాయితీ అందుతుందని, వెచ్చించిన మిగతా మొత్తాన్ని గ్రిడ్కు విద్యుత్ అందించడం ద్వారా ఐదారేళ్లలో తీర్చుకోవచ్చన్నారు. ఇచ్చిన పాలసీ అందరూ అర్థం చేసుకోవాలన్నారు.

రైతులకు స్పింకర్లు, డ్రిప్ పంపిణీ
సూక్ష్మ సాగునీటి పథకంలో భాగంగా రైతులకు డ్రిప్లు, స్ప్రింకర్లు పంపిణీని చేపట్టారు. తిరుపతి జిల్లాలోని రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన సామాగ్రి లారీలను జెండా ఊపి ముఖ్యమంత్రి ప్రారంభించారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.