వారాహి–ప్రత్యంగిరా–శరభేశ్వర స్వామి దేవాలయాల మహా ప్రారంభోత్సవం

Facebook
X
LinkedIn

తెలంగాణ మంత్రులకు ఘన ఆహ్వానం

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా సమీపంలోని కుకునూరుపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తిచేసుకుంటున్న శ్రీ శ్రీ శ్రీ వారాహి అమ్మవారు, ప్రత్యంగిరా దేవి, శరభేశ్వర స్వామి దేవాలయాల మహా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ దేవాలయ సముదాయం కుకునూరుపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా రూపుదిద్దుకుంటోందని నిర్వాహకులు తెలిపారు. దేవాలయాల మహా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 29, 30 మరియు మే 1, 2 తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖను, పశుసంవర్ధక శాఖ, యువజన మరియు క్రీడల శాఖ మంత్రివర్యులు వాకాటి శ్రీహరిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే–ఎంపీ కాలనీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ వారాహి ఉపాసకులు, వారాహి–ప్రత్యంగిరా–శరభేశ్వర స్వామి దేవాలయాల చైర్మన్ మాతృశ్రీ మమతమ్మ, అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.బి. శ్రీధర్ కలిసి మంత్రులను శాలువాలతో ఘనంగా సన్మానించి దేవాలయాల మహా ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ, భక్తిశ్రద్ధలతో వారాహి–ప్రత్యంగిరా–శరభేశ్వర స్వామి దేవాలయాలను నిర్మిస్తున్న దేవాలయాల చైర్మన్ మాతృశ్రీ మమతమ్మ సేవలను ప్రశంసించారు. ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. దేవాలయాల మహా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని పేర్కొన్నారు.