సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

Facebook
X
LinkedIn

జస్టిస్ గవాయ్ సిఫార్సులకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ:

దేశ అత్యున్నత న్యాయస్థానం కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఈ నియామకానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.

జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, దాదాపు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేయనున్నారు.

ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ 2025 నవంబర్ 23న రిటైర్ కానున్నారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ప్రాతిపదికన తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు న్యాయశాఖ తెలిపింది.


జస్టిస్ సూర్యకాంత్‌ జీవన ప్రయాణం

హర్యానాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, హిసార్ ప్రభుత్వ పీజీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆపై రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌.ఎల్‌.బీ పట్టా పొందారు.

హిసార్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి, చండీగఢ్‌లోని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000 జూలై 7న హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులై అతి పిన్న వయసులోనే ఆ బాధ్యతలు నిర్వర్తించారు.

2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, అక్కడి నుంచి 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జాతీయ న్యాయ సేవల అథారిటీ (NALSA)లో సభ్యుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.