న్యూ డిల్లీ :
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నారు.ధనఖడ్ గతంలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. 1993 నుంచి 1998 వరకూ అజ్మేర్లోని కిషన్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. నిబంధనల ప్రకారం.. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే రూ.35వేల పింఛనుకు అర్హులు. ఈ రూల్స్ ప్రకారం.. ఆయన 2019 జులై వరకూ మాజీ శానసభ్యుడిగా ధన్ఖడ్ పెన్షన్ పొందారు. అయితే, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులవడంతో పెన్షన్ ఆగిపోయింది.2019 నుంచి 2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా తన పదవీకాలం ముగియడంతో మాజీ ఎమ్మెల్యేగా తన పెన్షన్ను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ధన్ఖడ్ రాజస్థాన్ అసెంబ్లీ సచివాలయానికి కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని తాజాగా వెల్లడించారు. మాజీ ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ మాజీ ఎమ్మెల్యే పెన్షన్కు దరాఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.కాగా, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేకు రూ.35వేల పెన్షన్ వస్తుంది. అంతేకాదు వయసు ఆధారంగా ఆ మొత్తంలో పెంపు కూడా ఉంటుంది. 70 ఏళ్లు దాటిన మాజీ ఎమ్మెల్యేకి 20 శాతం అదనపు పింఛను అందుతుంది. 80 ఏళ్లు దాటితే అది 30 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం ధన్ఖడ్ వయసు 74 ఏళ్లు కావడంతో ఆయనకు మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కింద రూ.42 వేల వరకు వస్తుంది.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.