విశాఖపట్నం :
విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శాంతిపురం వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రయాణికులందర్నీ దించేశారు. క్రమంగా మంటలు వ్యాపించడంతో అంతా చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది.అయితే పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిపామక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. కాగా, ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరుగలేదని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.