ముగ్గురు భక్తుల మృతి – పలువురికి గాయాలు
పూరీ :
జగన్నాథుడి రథయాత్రలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఖుర్దా జిల్లా వాసులుగా గుర్తించారు.
పూజారి గుంపులో తొక్కిసలాట
ఉత్సవానికి హాజరైన వేలాది భక్తులు స్వామివారి దర్శనానికి గుండిచా ఆలయం వద్ద గుమిగూడారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రథాలు ఆలయ ద్వారాన్ని చేరుకోగానే భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. ఇదే సమయంలో కొందరు కిందపడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. అధికారుల వివరాల ప్రకారం మృతులు ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మహంతి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు
భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసు బందోబస్తు లేదని స్థానికులు ఆరోపించారు. గతంలో ఇదే తరహా ఘటనలు జరిగినప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని విమర్శిస్తున్నారు.
ఆలస్యంపై రాజకీయ దుమారం
రథయాత్ర ఆలస్యంపై రాజకీయాలు మొదలయ్యాయి. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ దీనిని ‘‘దారుణ గందరగోళం’’గా అభివర్ణించారు. ‘‘ఈ దివ్యమైన ఉత్సవానికి నీలినీడలు అలుముకున్నాయి’’ అన్నారు. దీనికి ప్రతిగా న్యాయశాఖ మంత్రి పృథ్విరాజ్ హరిచందన్ స్పందిస్తూ, ‘‘రాజకీయ లబ్ధికోసం బీజేడీ వ్యాఖ్యలు చేస్తోంది. గతంలో రథాలు ఎప్పుడూ రెండో రోజే గుండిచా ఆలయానికి చేరేవి’’ అని అన్నారు.
సంప్రదాయం ఇలా…
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో కూడిన మూడు రథాలు గుండిచా ఆలయానికి చేరిన అనంతరం, అక్కడ దేవతలు వారం రోజులపాటు బస చేస్తారు. అనంతరం తిరిగి జగన్నాథ ఆలయానికి తిరుగుయాత్ర జరుగుతుంది. కానీ ఈసారి ఆలస్యం, తొక్కిసలాట కలిపి యాత్రలో విషాదాన్ని మిగిల్చాయి.