న్యూఢిల్లీ :
పాస్పోర్టు సేవలలో మెరుగైన పనితీరు, సంస్కరణలకూ, ప్రజాసేవలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం (ఆర్పీవో)కు కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన 13వ పాస్పోర్టు సేవా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ప్రదానం చేశారు.
హైదరాబాద్ ఆర్పీవో తరఫున అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ ఈ అవార్డును అందుకున్నారు.
అదే వేదికపై పాస్పోర్టు వెరిఫికేషన్లో అత్యుత్తమ సేవలందించిన తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా ప్రత్యేక అవార్డు లభించింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం డీజీ బత్తుల శివధర్రెడ్డి ఈ గౌరవాన్ని స్వీకరించారు.
ఆధునికీకరణే మన బలం
ప్రజలకు వేగంగా, పారదర్శక సేవలు అందించేందుకు హైదరాబాద్ ఆర్పీవో అనేక సంస్కరణలు చేపట్టిందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో, పోలీసు విభాగం ఆధునిక సాంకేతికతను వినియోగించి పాస్పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో కీలక పాత్ర వహించిందని ప్రశంసలు అందుకున్నది.
ఈ కార్యక్రమం ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల వార్షిక సమావేశం – 2025 లో భాగంగా నిర్వహించబడింది.