ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ
న్యూ డిల్లీ :
ప్రధాని నరేంద్రమోదీ నినాదాలు ఇచ్చే కళలో మాస్టర్ డిగ్రీ చేశారని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ విమర్శించారు. ప్రధాని తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా కార్యక్రమంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మేకిన్ ఇండియా గురించి ప్రధాని మోదీ గొప్పలు చెప్పారని, దేశంలోని తయారీరంగంపై దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదని అన్నారు.ఈ మేరకు రాహుల్గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. మేకిన్ ఇండియాతో దేశంలో తయారీరంగ పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోందని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా ప్రభావం ఉంటే తయారీరంగ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోయిందని, నిరుద్యోగ యువత సంఖ్య భారీగా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.ప్రస్తుతం తయారీరంగ పరిశ్రమ వాటా దేశ ఆర్థికవ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని రాహుల్గాంధీ చెప్పారు. ఇది రికార్డు స్థాయి పతనమని, 2014 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీరంగం వాటా ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారని అన్నారు. అంతేగాక చైనా నుంచి భారత్కు దిగుమతులు రెండింతలు పెరిగాయని తెలిపారు. ప్రధాని మోదీ నినాదాలు ఇచ్చే కళలో మాస్టర్ డిగ్రీ చేశారు కానీ.. సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకబడ్డారని రాహుల్గాంధీ విమర్శించారు.