హైదరాబాద్,
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులను కీలక నగరాల్లోని ప్రధాన కార్యాలయాలకు (హబ్లకు) బదిలీ అయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ కోసం కేవలం 30 రోజుల గడువును మాత్రమే ఇచ్చింది. నిర్ణీత గడువులోగా బదిలీ కాకపోతే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (సెవరెన్స్ ప్యాకేజ్) అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
తక్షణ బదిలీ ఆదేశాలు
బ్లూమ్బెర్గ్ కథనం ప్రకారం… అమెజాన్ యాజమాన్యం సియాటిల్, ఆర్లింగ్టన్, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో ఉన్న హబ్లకు ఉద్యోగులను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలువురికి ఆదేశాలు అందాయి. ఈ విషయాన్ని సంస్థ ఆంతరికంగా, మేనేజర్ల ద్వారానే తెలియజేసినట్లు తెలుస్తోంది.
అంగీకరించకపోతే సెవరెన్స్ రద్దు
బదిలీ నిర్ణయాన్ని ఉద్యోగులు ఆమోదించకపోతే… రెండు నెలల్లోగా రాజీనామా చేయాల్సి ఉంటుందని సంస్థ సూచించింది. గడువులోగా బదిలీ కాని వారికి సెవరెన్స్ ప్యాకేజీ ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో తమ భవిష్యత్తుపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. కుటుంబ బాధ్యతలు, స్థిరపడ్డ జీవితం ఉన్నవారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొంటున్నారు.
ఏఐ భయాల మధ్య నిర్ణయం
అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ఇటీవల ఉద్యోగులకు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగే నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బదిలీల తాలూకు నిర్ణయం ద్వారా సంస్థ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామాకు దింపాలని చూస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు అమెజాన్ దశలవారీగా సుమారు 27 వేల ఉద్యోగాలను తొలగించింది.