బాధిత కుటుంబాలకు క్షమాపణలు – అన్ని విధాల సహాయానికి టాటా సంస్థ హామీ
అహ్మదాబాద్ :
గత గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 270 మందికి పైగా ప్రయాణికుల కుటుంబాలకు ఆయన హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. టాటా గ్రూప్ వారి విమానయాన సంస్థ నుంచి ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘‘మాటలు రావడం లేదు.. బాధితులకు క్షమించండి’’
ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు మాటలు చాలవని చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇది మాకు చాలా తీవ్ర ఆత్మవేదన కలిగించే సంఘటన. మేము బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. అవసరమైన సాయాన్ని వెంటనే అందిస్తాం’’ అని తెలిపారు.
సురక్షితమే.. అనుభవజ్ఞులే పైలట్లు
ప్రమాదంలో చిక్కిన డ్రీమ్లైనర్ ఎయిరిండియా ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భవనంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, బ్లాక్బాక్స్ డేటా ఆధారంగా అసలు కారణం బయటపడుతుందని చంద్రశేఖరన్ చెప్పారు. విమానం అత్యాధునిక సాంకేతికతతో కూడుకున్నదని, ఇటీవలే నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు.
ఇంజిన్ల వివరాలు వెల్లడించిన చైర్మన్
విమానంలోని కుడివైపు ఇంజిన్ను 2025 మార్చిలో ఓవర్హాల్ అనంతరం అమర్చినట్టు తెలిపారు. ఎడమవైపు ఇంజిన్ నిర్వహణ 2023 జూన్లో జరిగిందని, తదుపరి నిర్వహణ డిసెంబరులో జరగాల్సి ఉందని వివరించారు. పైలట్ల అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. కెప్టెన్ సభర్వాల్కు 11,500 గంటలు, సహాయ పైలట్ కుందర్కు 3,400 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉందని పేర్కొన్నారు.
డీజీసీఏ దర్యాప్తు కమిటీ నియామకం
ఈ ఘటనపై డీజీసీఏ ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు చంద్రశేఖరన్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని, పూర్తి నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.