డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలు రూ.1,016 కోట్లుగా నమోదు

Facebook
X
LinkedIn

 క్రితం ఏడాది రూ.234 కోట్లు

బ్యాంకింగ్‌ మోసాలు 36 వేల కోట్లు..

బెడిసికొడుతున్న రిజర్వు బ్యాంక్‌ ప్రయత్నాలు

రిజర్వుబ్యాంక్‌ వార్షిక నివేదికలో వెల్లడి

ముంబై : 

బ్యాంకింగ్‌లో మోసాలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రుణ ఖాతాలు, డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి సంఖ్య పరంగా తగ్గినప్పటికి విలువ పరంగా చూస్తే మాత్రం మూడింతలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వు బ్యాంక్‌ విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంచేసింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.36,014 కోట్ల విలువైన మోసాలు జరిగాయని తెలిపింది. అంతక్రితం ఏడాది రూ.12,230 కోట్ల మోసాలు జరిగాయి. సంఖ్యపరంగా చూస్తే మాత్రం 2023-24లో 36,060 మోసాలు జరగగా, ఆ తర్వాతి ఏడాదికిగాను 23,953కి తగ్గాయి. ప్రధానంగా 122 కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వర్గీకరించడం వల్లనే విలువ భారీగా పెరిగిందని తెలిపింది.బ్యాంకింగ్‌ మోసాల్లో డిజిటల్‌ పేమెంట్లు, కార్డు, ఇంటర్నెట్‌ ద్వారా జరిగే మోసాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. మొత్తం మోసాల్లో 60 శాతం మోసాలు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లోనే జరిగాయని తెలిపింది. మొత్తం విలువల్లో వీటి వాటా 71 శాతంగా ఉన్నది. కార్డు/ఇంటర్నెట్‌ ద్వారా జరిగే మోసాలు అధికంగా 13,516గా నమోదయ్యాయి. మొత్తం 23,956 మోసాల్లో వీటి వాటా 56.5 శాతంగా ఉన్నది. లక్ష రూపాయల కంటే అధికంగా నమోదైన మోసాల గురించి ఆర్బీఐ వివరించింది.

25% పెరిగిన కరెన్సీ ప్రింటింగ్‌ ఖర్చులు

కరెన్సీ ప్రింటింగ్‌ కోసం పెట్టే రిజర్వుబ్యాంక్‌ గరిష్ఠ స్థాయిలో ఖర్చు చేస్తున్నది. గతేడాదికిగాను కరెన్సీల ప్రింటింగ్‌ కోసం రూ.6,372.8 కోట్ల నిధులను ఖర్చు చేసింది. అంతక్రితం ఏడాది ఖర్చు చేసిన రూ.5,101.4 కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగినట్టు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. నోట్లు సంఖ్య ఆరు శాతం అధికం కాగా, విలువ పరంగా చూస్తే 5.6 శాతం పెరిగాయి. కరెన్సీ ప్రింటింగ్‌లో రూ.500 నోట్‌ 86 శాతం వాటా కలిగివున్నది. క్రితం ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే రూ.10 డినామినేషన్‌ బ్యాంక్‌ నోట్‌ వాటా 16.4 శాతంగా ఉన్నది. మొత్తం బ్యాంక్‌ నోట్ల సర్క్యూలేషన్‌లో రూ.10, రూ.20, రూ.50 మొత్తంగా 31.7 శాతం వాటా కలిగివున్నది. రెండేండ్ల క్రితం రద్దు చేసిన రూ.2 వేల నోట్లలో ఇప్పటి వరకు 98.2 శాతం నోట్లు బ్యాంకుల వద్ద జమ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.2, 5, 10, 20, 50, 100, 200, 500 నోట్లు చలామణిలో ఉన్నాయి.రిజర్వు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ ఏడాది ప్రాతిపదికన 8.20 శాతం ఎగబాకి రూ.76.25 లక్షల కోట్లకు చేరుకున్నది. నగదు నిల్వలు అత్యధికంగా ఉండటంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సెంట్రల్‌ బ్యాంక్‌..కేంద్ర ప్రభుత్వానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు జరిపింది. పసిడి ఆస్తులు 52.09 శాతం అధికమవగా, దేశీయ పెట్టుబడులు 14.32 శాతం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు 1.70 శాతం అధికమయ్యాయి.

పసిడి నిల్వలు హైజంప్‌

రిజర్వు బ్యాంక్‌ వద్ద ఉన్న పసిడి నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సెంట్రల్‌ బ్యాంక్‌ విడుదల చేసిన వార్షిక నివేదికలో పసిడి విలువ ఏడాది ప్రాతిపదికన 57.12 శాతం ఎగబాకి రూ.4,31,624.8 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. అదనంగా 54.13 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతోపాటు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లనే విలువ పెరిగిందని వెల్లడించింది. మార్చి 31, 2024 నాటికి గోల్డ్‌ రిజర్వులు రూ.2,74,714.27 కోట్లుగా ఉన్నది.ముక్కలు చేసిన నోట్లతో కణ బోర్డులను తయారు చేస్తున్నారు.డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలు రూ.1,016 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది రూ.234 కోట్లుగా ఉన్నాయి.ప్రస్తుతం రిజర్వుబ్యాంక్‌ వద్ద 879.58 మెట్రిక్‌ టన్నుల విలువైన గోల్డ్‌ రిజర్వులు ఉన్నాయి. అంతక్రితం ఏడాది 822.10 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి.311.38 మెట్రిక్‌ టన్నుల విలువైన పసిడి ఆస్తులు కలిగివుండగా, మిగతా 568.20 మెట్రిక్‌ టన్నుల విలువైన పసిడి బ్యాంకింగ్‌ డిపార్ట్‌మెంట్ల వద్ద ఉన్నది.గడిచిన ఆర్థిక సంవత్సరంలో అదనంగా 54.13 మెట్రిక్‌ టన్నుల విలువైన పసిడిని కొనుగోలు చేసింది.