ఈడీ అన్ని హద్దులూ దాటుతోంది

Facebook
X
LinkedIn

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

న్యూ డిల్లీ :

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులూ దాటుతోందని వ్యాఖ్యానించింది. సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందన్న ఆక్షేపించింది. టాస్మాక్‌ పై జరుగుతున్న మనీలాండరింగ్‌ దర్యాప్తును వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్‌ టాస్మాక్‌లో రూ.1000 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్మాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం, టాస్మాక్‌ అధికారుల ఇళ్లల్లో ఈ ఏడాది మార్చి, మే నెలల్లో తనిఖీలు చేపట్టింది. దీంతో ఈ సోదాలపై తమిళనాడు సర్కార్‌ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ ఈడీ చర్యలను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. విచారణ పేరిట టస్మాక్‌ అధికారులను ఈడీ వేధిస్తోందంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ.. ఈడీ దర్యాప్తుకు అనుమతించింది. దీనిపై స్టాలిన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.దీనిపై తాజాగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈడీ ‘అన్ని హద్దులూ మీరుతోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందన్న ధర్మాసనం.. టాస్మాక్‌ పై జరుగుతున్న మనీలాండరింగ్‌ దర్యాప్తును వెంటనే ఆపేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పును డీఎంకే ప్రభుత్వం స్వాగతించింది.