రైస్ జన్యు మార్పిడి విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం హేయనీయం

Facebook
X
LinkedIn

ఈ నిర్ణయం వల్ల దేశంలో ఉన్న ఫుడ్ సిస్టమ్ పై ప్రభావం

* వరి జన్యు మార్పిడి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖ

* కేంద్రానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి లేఖ.

హైదరాబాద్ :

రైస్ జన్య మార్పిడికి కేంద్రం అనుమతించడాన్ని రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి లేఖరాశారు. రైస్ జన్యు మార్పిడి విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అత్యంత తీవ్రమైందని అభివర్ణించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలో ఉన్న ఫుడ్ సిస్టమ్ పై ప్రభావం చూపుతుందన్నారు.  గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్నప్పుడు ఆహార పంట అయినా వంకాయ జన్య మార్పిడిని కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.  అప్పటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాష్ట్ర రైతాంగం అభిప్రాయాన్ని మన్నించి ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం కేంద్రం లో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వరి ధాన్యాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ అని.. ఇక్కడి రాష్ట్ర రైతాంగం తరుపున రైతు కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.  ఈ నిర్ణయం వల్ల రైస్ వినియోగదారుడిపై కూడా  తీవ్రమైన ప్రభావం పడ్తుందని, ఎక్కువ శాతం వరి పండించే తెలంగాణపై ఈ నిర్ణయంతో తీవ్రమైన ఆర్ధిక ప్రభావం పడుతుందని చైర్మన్ కోదండరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.  అంతేకాదు విత్తన హక్కుకు కూడా భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కీలకమైన ఈ నిర్ణయం తీసుకోకముందు రాష్ట్ర అభిప్రాయం తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు, అంతేకాదు వినియోగదారులను పరిగణలోకి తీసుకోకపోవడం  తీవ్రమైన విషయంగా కమిషన్ పరిగణిస్తుందన్నారు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశ వ్యవసాయము రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు.