తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ ఈ పిటిషన్‌ దాఖలు చే సింది. ఈ పిటిషన్‌ను త్వరగా విచారణకు స్వీకరించాలని అభ్యర్థించింది.ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని బీఆర్‌ఎస్‌ తన పిటిషన్‌లో గుర్తుచేసింది. అక్టోబర్ 31వ తేదీ లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించిందని తెలిపింది. అత్యున్నత స్థానం ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. దీంతో ఇంకా ఫిరాయింపు నేతలు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారని చెప్పింది. అందుకే మరోసారి అత్యున్నత స్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పింది.ఈ విషయంలో ప్రొసీడింగ్స్‌ ఆలస్యం చేస్తే.. వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని బీఆర్‌ఎస్‌ తెలిపింది. ఇంకా ప్రొసీడింగ్స్‌ ఎవిడెన్స్‌ స్టేజిలోనే ఉన్నాయని బీఆర్ఎస్‌ పార్టీ తరఫు న్యాయవాదులు తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి రిటైర్‌ అయ్యేంతవరకు ఈ ప్రక్రియను సాగదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ వాదనలు విన్న సీజేఐ.. నవంబర్‌ 24తో సుప్రీంకోర్టు ముగిసినట్లు కాదని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం ఈ కేసు విచారణ జరుపుతామని తెలిపారు.