కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలని తాటికొండ రాజయ్య  డిమాండ్

Facebook
X
LinkedIn

రాఘవపురం దగ్గర బిఆర్ఎస్ కార్యకర్తలు ఎంఎల్ఎ కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్దం

జనగాం :

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ ఎంఎల్ఎ రాజయ్య పాదయాత్ర   కాంగ్రెస్‌ వర్సెస్ బిఆర్‌ఎస్‌గా మారింది.  రాజయ్య హనుమకొండ నుంచి పాదయాత్రకు బయల్దేరారు. రాజయ్య వెంట దాస్యం వినయ్‌, నన్నపునేని నరేందర్ ఉన్నారు. రాఘవపురం దగ్గర ఎంఎల్ఎ కడియం శ్రీహరి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.ఈ సందర్భంగా రాజయ్య మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య  డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్‌ జెండాతో కడియం శ్రీహరి గెలిచారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో చేరానని కడియం ప్రకటిస్తే వదిలేస్తామని, తాను పాదయాత్ర చేస్తే కడియం శ్రీహరికి భయం ఎందుకు అని రాజయ్య ప్రశ్నించారు.కడియం శ్రీహరికి ఉప ఎన్నికల భయం పట్టుకుందని బిఆర్ఎస్ నేత నన్నపునేని నరేందర్ చురకలంటించారు. ఉప ఎన్నికల భయంతోనే కడియంకు జ్వరం వచ్చిందని, కడియం రాజకీయ నిష్క్రమణకు ఉప ఎన్నికలే రెఫరెండమన్నారు. కడియం నిష్క్రమణ రావణాసుర వధలా ఉంటుందని, రాజయ్య వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. కడియంకు నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాజీనామా చేసే వరకు కడియంను వదిలి పెట్టే ప్రసక్తే లేదని నన్నపునేని నరేందర్ హెచ్చరించారు.