శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీరు..

Facebook
X
LinkedIn

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.80 అడుగులు

ఇన్‌ఫ్లో 91,812 క్యూసెక్కులు.. అవుట్‌ ఫ్లో 1,14,709 క్యూసెక్కులు

శ్రీశైలం :

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రభావం కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద వచ్చి డ్యామ్‌లో చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 91,812 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇక అవుట్‌ ఫ్లో 1,14,709 క్యూసెక్కులుగా నమోదైంది. ఒక స్పిల్‌వే గేట్‌ ఎత్తి 27,52 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 20వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. ఎడమ గట్టు, కుడిగట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఎడమగట్టు నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు నుంచి 31,870 క్యూసెక్కులు వరద దిగువకు వెళ్తున్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.80 అడుగుల మేర నీరుంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 208.72 టీఎంసీల మేర నిల్వ ఉందని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే కృష్ణా నదికి వరద ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.