హైదరాబాద్ :
తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోట లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు గోల్కొండకు చేరుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.