కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం!

Facebook
X
LinkedIn

హర్షవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణ

హైదరాబాద్‌:
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి రాజకీయ కలకలం రేపుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్‌నే కారణంగా కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను కామారెడ్డి కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు, 16 రోజుల పాటు నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు మమ్మల్ని ఎప్పుడూ ట్రాక్ చేసేవారు. దీంతో మా వ్యూహాలు ప్రభుత్వానికి తెలిసిపోయాయి. ఫలితంగా రేవంత్ రెడ్డి ఓటమిని చవిచూశారు” అన్నారు.

పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేశారని, ఎన్నికల సమయంలో వాహనాల తనిఖీలు, అనుసరణలు జరిగాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో తమను ఉగ్రవాదుల్లా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలతోపాటు న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు కూడా బాధితులుగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై టెలిగ్రాఫ్ చట్టం కింద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.