ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి

Facebook
X
LinkedIn

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (EPDC)విజ్ఞప్తి.

హైదరాబాద్ :

వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ సీజన్‌లో ప్రతి రైతు కుటుంబం కనీసం కొంత మేరకైనా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (EPDC) విజ్ఞప్తి చేసింది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే తెలంగాణ రైతులు కూడా ఆధునిక, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని కౌన్సిల్ అభిప్రాయపడింది. సాంప్రదాయ రసాయన ఆధారిత వ్యవసాయ పద్ధతులు పర్యావరణ కాలుష్యానికి దారితీయడమే కాకుండా, రసాయన వ్యర్థాలతో కూడిన ఆహార పదార్థాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని EPDC గుర్తు చేసింది. ప్రజల్లో సేంద్రియ ఉత్పత్తుల పట్ల పెరుగుతున్న అవగాహన, వాటి కోసం పెరుగుతున్న డిమాండ్‌ను రైతులు గుర్తించాలని సూచించింది. రసాయన విధానాలకే పరిమితమైతే భవిష్యత్తులో మార్కెట్ కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఈ సమస్యను నివారించడానికి, ప్రభుత్వం ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, 100 శాతం రాయితీ, ప్రత్యేక మార్కెట్ వసతి కల్పించి ప్రోత్సహించాలని EPDC అధ్యక్షుడు రంగయ్య శుక్రవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. మార్పు వైపు  ఆలోచించకుండా ప్రభుత్వాలు పాత పద్ధతులనే కొనసాగిస్తే అది రైతులకు మోసం చేసినట్టే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చని తద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని EPDC స్పష్టం చేసింది. నేడు  ప్రపంచం మొత్తం సేంద్రియ ఉత్పత్తుల వైపు చూస్తున్న వాస్తవం ప్రభుత్వం గుర్తించాలని, తెలంగాణ రైతును  ఆదిశగా నడిపిస్తే దేశం  మొత్తం. ఆచరించే అవకాశం ఉందని రంగయ్య హెచ్చరించారు.