మోటూరు హనుమంతరావు నిబద్ధత కలిగిన సంపాదకులు

Facebook
X
LinkedIn

కాప్రా :

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో సుప్రసిద్ధ రచయిత మాక్సిం గోర్కీ మరియు సుప్రసిద్ధ పత్రిక సంపాదకులు మోటూరు హనుమంతరావు గారి వర్ధంతుల సందర్భంగా నివాళి కార్యక్రమం జరిగింది.

దీనికి స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. మాక్సిం గోర్కీ చిత్రపటానికి ప్రముఖ సామాజిక ఉద్యమ నేత జయరాజు , మోటూరు హనుమంతరావు చిత్రపటానికి ట్రేడ్ యూనియన్ నాయకులు అశోక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు జె చంద్రశేఖర రావు మాట్లాడుతూ మోటూరు హనుమంతరావు నిబద్ధత కలిగిన సంపాదకులుగా ఉండి ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ పోరాటాలకు దిక్సూచిగా నిలిచారని చెప్పారు. కార్యకర్తల పట్ల ప్రజల పట్ల నిబద్ధత కలిగిన గొప్ప నాయకులు మరియు సంపాదకులుగా నిలిచారని చెప్పారు.

జయరాజు మాట్లాడుతూ మాక్సిం గోర్కి రష్యా విప్లవంలో కీలక పాత్రగా అనేక రచనలు చేశారని అన్నారు. బాల్యంలో దుర్భరమైన జీవితాన్ని గడిపిన గోర్కీ తన జీవితాన్ని అనుభవాలను కథలుగా రచనలుగా చేసి ప్రజలను కదిలించగలిగారని చెప్పారు. వారు రచించిన అమ్మ నవల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విప్లవకాలను తయారు చేసింది అని చెప్పారు. సామాన్య జీవితాలను విప్లవాత్మకంగా మల్చడంలో వారు కృషి ఎనలేనిదని అన్నారు.

ప్రముఖ పాత్రికేయులు గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ గోర్కీ రాసిన అమ్మ నవల నన్ను విద్యార్థి దశలో ఎంతో ప్రభావితం చేసింది అని చెప్పారు. అంతేకాకుండా మోటూరు హనుమంతరావు గారు నన్ను తీర్చిదిద్దటంలో ప్రముఖంగా ఉన్నారని అన్నారు. ఆయన పత్రికా రంగంలో దిద్దిన పాఠాలు నాకు జీవితానికి సార్ధకత ఇచ్చాయని అన్నారు.

శ్రీమన్నారాయణ మాక్సిం గోర్కి రచనలు మరియు మోటూరు హనుమంతరావు గారి రచనల ప్రాధాన్యతను జీవిత విశేషాలను గొప్పగా వివరించారు. కోమటి రవి, శివరామకృష్ణ గొడుగు యాదగిరి రావు ప్రసంగించారు. అనంతరం సబికులందరూ చిత్రపటాలకు పూలను సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేకే ఉన్నికృష్ణన్, శోభ,గౌస్య, ఎన్ శ్రీనివాస్, శ్రీనివాసరావు, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.