అక్రమ నిర్మాణాలకు ఎర్ర రిబ్బన్ తాళం
హైదరాబాద్:
నగరంలో అక్రమ కట్టడాలపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై అనుమతి లేకుండా నిర్మించే భవనాలు, అనుమతిని అతిక్రమించి నిర్మించిన కట్టడాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు.
సీజ్ ఆదేశాలు జారీ
జీహెచ్ఎంసీ చట్టం – 1955 సెక్షన్ 461–ఏ ప్రకారం, అలాగే టీజీ-బీపాస్ నిబంధనల ప్రకారం, అక్రమ కట్టడాలను సీజ్ చేయవచ్చని కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఎవరైనా నివసిస్తున్నట్లయితే, వారికి మూడు రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఖాళీ చేయకపోతే నిర్మాణాన్ని సీజ్ చేసి, అందులో ప్రవేశించే మార్గాలన్నింటినీ ఎర్రటి రంగు రిబ్బన్తో మూసివేయాలని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై కోర్టు ఆగ్రహం
తాజా చర్యలకు కారణం – హైకోర్టు చేసిన గంభీర వ్యాఖ్యలే. అక్రమ కట్టడాలపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం, “నిర్మాణాలన్నీ పూర్తయ్యేవరకు అధికారులు ఏమి చేస్తున్నారు? ఆ సమయంలో కళ్లు మూసుకుంటారా?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ప్రతి ప్రాంతానికి అధికారులు ఉన్నా.. అక్రమ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో సమాధానం ఇవ్వాలని ఆగ్రహించింది.
ఇకపై కఠిన చర్యలు
అక్రమ నిర్మాణాలు నగర అభివృద్ధికి భయంకర భాదకరంగా మారుతున్నాయని, ప్రాథమిక మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైకి కనిపించే నిర్లక్ష్యాన్ని తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ వర్గాలు తెలిపాయి.