తెలుగునాడు, హైదరాబాద్ :
సాహితీ ప్రపంచంలో తెలుగు ఖ్యాతిని చాటిన కవిశ్రేష్ఠుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ సి.నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ సభ్యులు నివాళులర్పించారు.
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం కమలానగర్ ఆఫీసులో ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమం ప్రారంభ సూచికగా తెలుగు నాడు దినపత్రిక ఎడిటర్ గుమ్మడి హరిప్రసాద్, ఆర్టీసీ విశ్రాంత అధికారి కృష్ణమాచార్యులు డా. సి నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు జె శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నారాయణరెడ్డి అభ్యుదయ కవితో పాటుగా అనేక అంశాలపై అనేక రచనలు చేశారని సినిమా రంగంలో కూడా ప్రవేశించి గొప్ప గొప్ప సినీ గీతాలను రచించారని చెప్పారు. ఆయన సోవియట్ యూనియన్ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని వేనోళ్ళ పొగిడారు అని చెప్పారు. అంతేకాకుండా సోవియట్ భూమి పత్రికకు అనేక వ్యాసాలు కూడా వ్రాసారని చెప్పారు. అనేకమంది కవులకు ప్రేరణకుడిగా ఉన్నాడని అన్నారు.
జయరాజు మాట్లాడుతూ ఆయన సోవియట్ యూనియన్ పతనం అనంతరం కమ్యూనిజం అంతం అయిపోయిందని చాలా పత్రికలు రాసినప్పటికీ “ఎవడ్రా అన్నది కమ్యూనిజం పడిపోయిందని, తూర్పున సూర్యుడు ఉదయించి నంతకాలం కమ్యూనిజం నిలుస్తుందని కవిత్వం రాసి ప్రజల్లో ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పారు.
యువ నాయకుడు గిరీష్ మాట్లాడుతూ సినిమా రంగంలో ఆయన విశేష కృషి చేశారని చెప్పారు, శారద, కోమటి రవి, శివరామకృష్ణ , రుక్కయ్య , భాస్కర రావు, కృష్ణమాచార్యులు, గుమ్మడి హరి ప్రసాద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శోభ, గౌసియా, జె చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
