హైదరాబాద్ :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI), TPSK సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాకవి, ప్రకృతి తత్వ కవి జయరాజు ముఖ్య అతిథిగా హాజరై మొక్క నాటి మాట్లాడారు.
జయరాజు గారు మాట్లాడుతూ ‘సేవ్ ది నేచర్ – సేవ్ ది ఫ్యూచర్ ‘ , ప్రకృతిని కాపాడుకుంటే మన భవిష్యత్ కాపాడబడుతుంది అని, ప్రకృతి పచ్చగా ప్రశాంతంగా ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని, చెట్టు లేకపోతే జంతుజాలం జీవజాలం బతికి బట్టగడుతాయి. పర్యావరణ సమతుల్యతకు చెట్టు ఆధారభూతంగా నిలుస్తుందనీ అన్నారు.
అడవి సకల జనకోటికి ఆదరువుగా ఉంటది. పచ్చని అడవిని ఆదివాసి వాగ్దానం చేస్తున్నాడు. ఆదివాసి ఉన్నాడంటే అడవి పచ్చగా కళకళలాడుతుంది అని అర్థం. ఆ అడవి నేడు ప్రమాదంలో పడింది. ఆదివాసినీ అడవి నుండి తరుముతున్నారు. వారి పేగు బంధాన్ని తెంపుతున్నారు. ఆదివాసీలే అడవి రక్షకులు. అట్లాంటి ఆదివాసి అనేక వాదాల పేరుతో అనుమానంగా చూస్తూ అంతం చేయడం రాజ్యం దుర్మార్గ స్వభావాన్ని తెలియ చేస్తుంది. అందుకే ఆదివాసి అడవులు అల్లుకున్న తీగ లాంటి బంధాలు, ఆ బంధాలు తెగితే జన బతుకు బంధం తెగిపోద్దని ఆయన అన్నారు.
TPSK అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పచ్చనాకు ప్రగతికి తార్కాణం. చెట్టు పుట్ట మట్టి ఉంటేనే మానవులు నగరాల్లో నెనరు లేకుండా బతకగలరు. లేకుంటే కాలుష్యం మనుషులను కాటేస్తది. భవిష్యత్ పిల్లలకు మంచి ప్రకృతిని ఇచ్చే బాధ్యత ఉంది.
TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ.విజయ్ కుమార్ మాట్లాడుతూ వారసులకు ఆస్తులు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎలాగోలా బతికేస్తారు. ఆక్సిజన్ లేకపోతే ఎలాగూ బతకలేరు. కావున మొక్కలు నాటి వారసులకు ఆక్సిజన్ ను ఆస్తులుగా ఇవ్వాలని ఆయన పిలుపు నిచ్చారు. అలాగే బహుళ జాతి మైనింగ్ కోసం అడవులను లేకుండా చేస్తున్నారు. దేశంలో 24 శాతంతో, తెలంగాణ రాష్ట్రంలో 21 శాతంతో ఉండాల్సిన అడవి కంటే తక్కువే ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయొద్దని, కొండలు గుట్టలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో DYFI జిల్లా కార్యదర్శి జావేద్, నాయకులు రాజయ్య, TPTLF హైదరాబాద్ నాయకుడు సైదులు సార్, SFI నాయకుడు సాయికిరణ్, సుందరయ్య వాకర్స్ క్లబ్ మిత్రులు ఇతరులు పాల్గొన్నారు.