ఓపెన్ మార్కెట్ లో సింగరేణి మిగులు విద్యుత్ విక్రయం

Facebook
X
LinkedIn

అమ్మకాల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన సింగరేణి సీ ఎం డీ శ్రీ. ఎన్ బలరామ్

తెలుగునాడు, హైదరాబాద్ :

సింగరేణి సంస్థ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి ఉత్పత్తి జరిగే విద్యుత్తులో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన విద్యుత్తును ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే ప్రక్రియను కొత్తగూడెం ప్రధాన కార్యాలయం నుండి శనివారం సాయంత్రం సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరామ్ ప్రారంభించారు. సింగరేణి సంస్థ ఏటా 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా దీనిలో ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇంకా మిగిలిన విద్యుత్తును దేశవ్యాప్తంగా ఇంధన అవసరం ఉన్న రాష్ట్రాలకు, సంస్థలకు బహిరంగ విపణిలో విక్రయించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మరియు ఉపముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గార్ల అనుమతి ఇచ్చారని, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ద్వారా అమ్మకాలు జరపనున్నామని సింగరేణి సీఎండీ శ్రీ ఎన్ బలరామ్ వెల్లడించారు. దీని వల్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్ ద్వారా దేశ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా విద్యుత్తు అమ్మకాలు జరిగి సంస్థకు కూడా లాభం చేకూరుతుందని, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ కింద తమ మిగులు విద్యుత్తును అమ్ముకోవడానికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ డి సత్యనారాయణ రావు, శ్రీ ఎల్వీ సూర్యనారాయణ, శ్రీ కె వెంకటేశ్వర్లు, ఈడీ కోల్ మూమెంట్ ఎస్ డీ ఎం సుభాని, ఈడీ ఎస్టీపీపీ శ్రీ చిరంజీవులు, జీఎం సీపీపీ శ్రీ మనోహర్, జీఎం మార్కెటింగ్ శ్రీ ఎన్.వి రాజశేఖర్ రావు కార్పోరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.