వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూత

Facebook
X
LinkedIn

హైదరాబాద్: వైరా మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ (57) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మదన్ లాల్, సోమవారం సాయంత్రం గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మదన్ లాల్, వైరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజాసేవలో పేరు గడించారు. ఆయన మృతితో పార్టీ తీవ్ర విషాదంలో మునిగింది. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ బీఆర్‌ఎస్ నాయకత్వం సంతాపం వ్యక్తం చేసింది. వైరా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. మదన్ లాల్ మృతిపట్ల వైరా నియోజకవర్గ ప్రజలు, రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.